ఇటీవల కర్ణాటక (Karnataka ) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓ యువతి తన భర్తతో కలిసి నదీ ఒడ్డున సెల్ఫీలు తీసుకుంటుండగా, ఆకస్మాత్తుగా భర్త నదిలో పడిపోయి మృతి చెందాడు. ఇందుకు కారణం భార్యే అని, తానే తోసిందని ఆరోపణలు రావడంతో ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. వీడియోలు, స్థానికుల వాదనలు దీనికి మరింత మలుపు తెచ్చాయి.
మరోవైపు షాకింగ్ ట్విస్ట్ – బాల్యవివాహం ఆధారాలు బయటకు
తాజాగా బాలల హక్కుల కమిషన్ దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. భార్యగా ఉన్న ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలు కూడా నిండకముందే ఆమెకు తాత వయస్సున్న వ్యక్తితో పెళ్లి జరిగినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులపై POCSO (Protection of Children from Sexual Offences) చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది కేసును పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకువెళ్లింది.
తాను తోసలేదని అంటున్న భార్య – మరింత దర్యాప్తు కీలకం
ఇంకా నదిలో భర్త మృతి జరిగిన పరిణామాలపై విచారణ కొనసాగుతోంది. యువతి ప్రకారం, తన భర్త ప్రమాదవశాత్తు నదిలోకి జారిపోయాడని, తానేం చేయలేదని చెప్పింది. ఇదే సమయంలో బాల్యవివాహం అంశం వెలుగులోకి రావడంతో ఆమె నిజమైన బాధితురాలా? లేక నిందితురాలా? అనే అంశంపై మళ్లీ మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇప్పుడు పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. పూర్తి నిజం వెలుగులోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
Read Also : CBN : నాన్నను రాజమండ్రి జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి – లోకేశ్