మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి, దేశవ్యాప్త విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం (ఆపరేషన్ కగార్) నేపథ్యంలో, అత్యున్నత స్థాయి నేత అయిన గణపతి జనజీవన స్రవంతిలోకి రావడం ఒక చారిత్రక పరిణామంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి.
US Attack : ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?
జగిత్యాల జిల్లా సారంగపూర్ నివాసి అయిన ముప్పాళ్ల లక్ష్మణరావు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ విప్లవ భావజాలం వైపు ఆకర్షితులై అడవిబాట పట్టారు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) మరియు ఎంసీసీఐ (MCCI) విలీనమై ‘మావోయిస్టు పార్టీ’గా ఆవిర్భవించినప్పుడు ఆయన తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ విప్లవ వ్యూహాలను రచించిన గణపతి, 2018లో అనారోగ్య కారణాలతో కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. గత కొంతకాలంగా ఆయన నేపాల్ వంటి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి వంటి కీలక అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. వీరి లొంగుబాటు తర్వాత గణపతి కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేలా పోలీసులు, ప్రభుత్వం చేసిన రాయబారాలు సఫలమైనట్లు కనిపిస్తోంది. తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో తన సొంత గడ్డపై శేష జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గణపతి లొంగుబాటు అధికారికంగా ఖరారైతే, తెలంగాణలో మావోయిస్టుల ఉనికి దాదాపు శూన్యమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :