ఆదివారం అర్థరాత్రి వరకూ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు(Kaleshwaram Report)పై తీవ్రంగా పోరాడిన హరీష్ రావు(Harishrao), సోమవారం సాయంత్రానికే లండన్లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు ఉదయం ఫామ్హౌస్కు వెళ్లిన నేతల్లో హరీష్ రావు లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఎన్నారై కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు బయటకు రావడంతో ఆయన విదేశాల్లో ఉన్న సంగతి స్పష్టమైంది. కుమార్తె ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించేందుకు లండన్ వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.
కవిత ఆరోపణల మధ్య హరీష్ రావు సైలెన్స్
హరీష్ రావు లండన్ వెళ్లడమే సాధారణం అయితే పెద్దగా చర్చ జరగేది కాదు. కానీ తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల కారణంగా ఇది రాజకీయ చర్చగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వెనుక హరీష్ రావే కారణమని, ఆయనతో పాటు సంతోష్ రావు కూడా పాత్ర వహించారని కవిత బహిరంగంగా ఆరోపించడం పెద్ద సంచలనమైంది. ఈ వ్యాఖ్యల తర్వాత హరీష్ రావు స్పందిస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ ఆయన నిశ్శబ్దంగా లండన్ వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించిన నేపథ్యంలో ఆయన లండన్ వెళ్లడంపై వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టమా?
హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న సంకేతాలు వస్తున్నాయి. పార్టీ అధికారికంగా ఆయనను సమర్థించే ట్వీట్లు చేస్తోంది. గతంలో ప్రతిపక్షాలు ఆరోపించినా, బీఆర్ఎస్లో ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదు. అందుకే ఈ సారి కవిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే హరీష్ రావు ఎప్పుడూ పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యక్తిగతంగా స్పందించే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. పార్టీ స్పందననే తన స్పందనగా స్వీకరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.