హైదరాబాద్: నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో సోదరుడు రామకృష్ణతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఒక వర్సిటీ అని, జాతికి మార్గదర్శకమన్నారు. అలాంటి మహనీయులకు మరణం ఎప్పటికీ ఉండదని తెలిపారు.
ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, చరిత్ర అన్నారు బాలయ్య. తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నాలు మూలలా చాటి చెప్పడమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. ప్రతి తెలుగు వాడికి సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల్లో రాజకీయాలపై ఆసక్తి, చైతన్యం పెంచిన వ్యక్తి అని, ప్రజల వద్దకు పాలన తీసుకు వచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ తెలిపారు. తన తండ్రి తీసుకు వచ్చిన పథకాల గురించి మరోసారి వివరించారు.
కాగా, నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఇంకా వేలాదిమంది అభిమానులు హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కు నివాళి అర్పిస్తున్నారు.