ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాలతో పాటు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేరిట బ్యాడ్మింటన్ అకాడమీ (Gopichand Badminton Academy) ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో గోపీచంద్ అకాడమీ కోసం 12 ఎకరాల భూమిని కేటాయించే నిర్ణయం తీసుకున్నారు. ఇదే స్పోర్ట్స్ సిటీలో ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి కూడా స్థలం కేటాయించనున్నారు.
సింగపూర్ పర్యటనలో స్పోర్ట్స్ మోడల్పై చర్చలు
రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించి అక్కడి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మోడల్, శిక్షణ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ ఓంగ్ కిమ్ సూన్తో ముఖాముఖి చర్చల ద్వారా విద్యార్థులకు చదువుతో పాటు ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ ఎలా అందించవచ్చో వివరాలు తెలుసుకున్నారు. ఈ స్పోర్ట్స్ స్కూల్ మోడల్ను ఏపీలో అమలు చేయడం ద్వారా యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.
త్వరలోనే అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ
గతంలో 2016లోనే గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా పలు మార్పుల కారణంగా అది నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతిని అభివృద్ధి చేయడంలో స్పోర్ట్స్ రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నారు.
Read Also : Trains Cancelled: ఆ రైళ్లన్నీ రద్దు – దక్షిణ మధ్య రైల్వే