దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ (GST) సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం గౌరవనీయమైనదని, జీఎస్టీ బచత్ ఉత్సవ్ను ప్రారంభించడాన్ని ఆనందకర పరిణామంగా అభివర్ణించారు. ఈ సంస్కరణలతో ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పన్ను వ్యవస్థను సరళతరం చేయడం, పేద, మధ్యతరగతి మరియు రైతులకు తక్షణ లబ్ధి చేకూర్చడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
కొత్త పన్ను శ్లాబ్లు – అన్నివర్గాలకూ లబ్ధి
జీఎస్టీ శ్లాబ్లను కేవలం 5% మరియు 18% శాతాలకు పరిమితం చేయడం వల్ల అన్నివర్గాల ప్రజలకు లాభం కలుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల్లో 99 శాతం 5% పరిధిలో ఉండటం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. వ్యాపారాల అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు ఇది అనుకూలమని ఆయన వివరించారు. “నాగరిక్ దేవో భవ” అనే ప్రధాని మంత్రం ప్రజల పట్ల గౌరవ భావనను పెంచుతుందని, అలాగే “గర్వ్ సే కహో, యే స్వదేశీ హై” అనే నినాదం జాతీయతా స్ఫూర్తిని పెంపొందిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా పిలుపు
ప్రధాని మోదీ (Modi) సూచించిన ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాధనకోసం ఈ సంస్కరణలు కీలకంగా ఉపయోగపడతాయని అన్నారు. తక్కువ ధరలు, సరళమైన పన్ను విధానం ప్రజలకు నేరుగా లాభదాయకమని, ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా జాతీయతా భావం పెంపొందించాలన్నారు. దసరా పండుగను ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రజల తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.