తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల (Water projects) విషయంలో నెలకొన్న విభేదాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. ముఖ్యంగా పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఈ వివాదంపై చర్చించేందుకు నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకొని సమన్వయం చేయాలనే ఉద్దేశంతో, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించనుంది.
సీఎంలను భేటీకి ఆహ్వానించిన కేంద్రం
ఈ వివాద పరిష్కారానికి ఎల్లుండి (జూలై 16) కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Chandrababu & Revanth)లను ఆహ్వానించింది. సమావేశానికి హాజరుకావడానికి వీలుందో లేదో తెలపాలని ఇద్దరు సీఎంలకు కేంద్రం లేఖ రాసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, బనకచర్ల లిఫ్ట్ ప్రాజెక్టు పరంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో, ఈ అంశాలను ప్రత్యక్షంగా సీఎంల సమక్షంలో చర్చించాలని కేంద్రం భావిస్తోంది.
బాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆసక్తికర దృశ్యం
ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన రేపటి (జూలై 15) నుంచి ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో పాటు, ఇతర కీలక సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు, జలశక్తి శాఖ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీకి ఎలా స్పందిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? అనే అంశంపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది.
Read Also : Nimisha Priya : ఎల్లుండే నిమిషకు ఉరిశిక్ష.. వాళ్ల మనసు మారదా?