హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ కు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కు సంబంధించి ఆరేళ్ల కిందటి కేసులో విచారణ సందర్భంగా ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3,72,219 పరిహారం చెల్లించాలని వర్మను కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

2018లో రామ్ గోపాల్ వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో అప్పటి నుంచి వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.