ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ , భారతీయ జనతా పార్టీ మధ్య హోరీహోరీ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తుంటే, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కసితో ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. పెద్దగా ఒపీనియన్ పోల్స్ అందుబాటులో లేకపోవడంతో, అందరి దృష్టి రాజస్థాన్లోని ఫలోడి సత్తా బజార్ (బెట్టింగ్ మార్కెట్) అంచనాలపైనే ఉంది. ఢిల్లీలో AAP 2015 నుంచి అధికారంలో ఉంది. గత 27 సంవత్సరాల్లో బీజేపీ ఢిల్లీ అధికారంలోకి రాలేదు.
ఫలోడి సత్తా బజార్ అంచనా ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీకి గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలే గెలుస్తుంది. 2013లో 28 సీట్లు గెలుచుకున్న ఆప్ 2015లో 70కి గానూ 67 సీట్లు సాధించింది. ఈసారి అధికార పార్టీ 38-40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ విషయానికి వస్తే, వారికి 30-32 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది.

కీలక ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ (ఆప్) వర్సెస్ పర్వేశ్ వర్మ (బీజేపీ) వర్సెస్ సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) మధ్య పోటీ జరగనుంది. ఇక్కడ కేజ్రీవాల్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బెట్టింగ్ ఆడ్స్ ఆయనకు 66-85 మధ్య ఉన్నాయి. కల్కాజీ నియోజకవర్గంలో అతిషి (ఆప్), రమేష్ బిధురి (బీజేపీ), అల్కా లాంబా (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. ఇక్కడ అతిషి ముందంజలో ఉన్నారు. ఆమె గెలుపు అవకాశాలు (బెట్టింగ్ ఆడ్స్) 25-33 మధ్య ఉన్నాయి. జంగ్పురా నియోజకవర్గంలో మనీష్ సిసోడియా (ఆప్), తర్వీందర్ సింగ్ మార్వా (బీజేపీ), ఫర్హాద్ సూరి (కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సిసోడియా బెట్టింగ్ ఆడ్స్ 55-70 మధ్య ఉన్నాయి.