వరుణ బీభత్సానికి బెంగళూరు(Bangalore) నీట మునిగింది. గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం నరకం చూస్తోంది. ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. బెంగళూరు (Bangalore) సిటీతో పాటు చిక్మగళూరు, తుమ్కూరు, మాండ్య మైసూర్, దావణగెరె సహా పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. అంతేకాదు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన సంఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. వర్షానికి తోడు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
హెచ్చరికలు ఉన్న ప్రధాన ప్రాంతాలు
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. ఈనెల 22వరకు వర్షాలు కురుస్తాయని… మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. స్కూళ్లు, కార్యాలయాలు మూసివేత.ట్రాఫిక్కి గండిపడింది – జలమయమైన రోడ్లపై వాహనాల నిలిచిపోయే పరిస్థితి. విద్యుత్ అంతరాయం, మొబైల్ నెట్వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయి.

వర్షపాతం గణాంకాలు
కెంగేరిలో అత్యధికంగా 132 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం ప్రకటించింది. బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 131.5 మి.మీ వర్షపాతంతో రెండో స్థానంలో ఉంది. అనేక ప్రాంతాల్లో రాత్రిపూట 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో సగటు వర్షపాతం 105.5 మి.మీ.గా రికార్డయినట్లు వాతావరణ కేంద్ర ప్రకటించింది.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే, బెంగళూరుతో పాటు దక్షిణ భారతంలో ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించే భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఏమీ అవసరం లేకపోతే ఇంట్లోనే ఉండటం మేలంటున్నారు నిపుణులు. ఇటు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందంటోంది IMD. ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణకూ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీలో ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Supreme Court: సైనికులపై వ్యాఖ్యలతో తీవ్ర వివాదం – విజయ్ షాపై సుప్రీం సీరియస్