Bank strike : సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి లక్ష్మీపతిరావు, నాయకులు శేషుకుమార్, పాపారావు తెలిపారు. బ్యాంక్ యాజమాన్యాలు, సెంట్రల్ లేబర్ కమిషనర్తో శుక్రవారం చర్చలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా త్వరలో తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో సమ్మె వాయిదా వేశామని తెలిపారు. అందువలన సోమ, మంగళవారాల్లో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని వారు తెలిపారు.

తాత్కాలికంగా వాయిదా
శుక్రవారం ఒంగోలులోని ఎస్బీఐ బ్యాంకు వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్బీయూ కన్వీనర్ రాజీవ్రత్నదేవ్ మాట్లాడుతూ.. తాము చేపట్టిన సమ్మెపై సానుకూలంగా స్పందించడంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసారు. ఏప్రిల్ మూడవ వారంలో ఫైనాన్స్ మంత్రిత్వ శాఖతో బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై సమవేశం జరుగు తుందన్నారు. ఈ సందర్భంగా సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉమాశంకర్, వెంకటరెడ్డి, శ్రీధర్, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, సుధాకర్రావు, హసన్, బ్రహ్మనాయుడు, ఏడుకొం డలు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది.
కాగా, యూఎఫ్బీయూ మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సమ్మె జరిగితే మార్చి 22 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది. ఎందుకంటే మార్చి 23న కూడా బ్యాంకులకు సెలవు దినం ఉంది. సమ్మె జరిగితే దీనివల్ల నగదు లావాదేవీలు, చెక్ క్లియరింగ్, చెల్లింపులు, రుణాల ప్రక్రియ వంటి వాటిపై ప్రభావం పడేది. యూఎఫ్బీయూలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ సహా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. ఈ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు.