షేక్ హసీనా సర్కార్ పడిపోయిన తర్వాత.. బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మతోన్మాదం, దాడులు, హింస, అశాంతి, అంతర్గత కలహాలతో బంగ్లాదేశ్ నిత్యం ఒక నరకంలా మారిపోతోంది. మరోవైపు.. భారత్కు వ్యతిరేకంగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక భారత్కు బద్ధ శత్రువులుగా ఉన్న పాకిస్తాన్, చైనాలతో బంగ్లాదేశ్ చేతులు కలుపుతోంది. మరోవైపు.. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగవుతుండటం భారత్కు మరింత ఇబ్బందికర పరిస్థితిగా మారింది. మరోవైపు.. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఉన్న వకార్ ఉజ్ జమాన్ను గద్దె దింపే యత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్.. ఆర్మీ చీఫ్ పదవిలోకి రావాలని భావిస్తున్నాడు.

మరోవైపు.. ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సైనిక సాయాన్ని కోరుతోంది. ఈ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య రాకపోకలు బాగా పెరిగాయి. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా భారత సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటుండడం మన దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం.. అక్కడి ఆర్మీ అధికారులతో భేటీ అవుతుండటం.. భారత్కు తలనొప్పిగా మారింది.
వకార్ ఉజ్ జమాన్ని దించేందుకు కుట్ర
త్వరలోనే బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు వస్తుందనే ఊహాగానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఆర్మీ చీఫ్ పదవి నుంచి వకార్ ఉజ్ జమాన్ని దించేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ భావాలు కలిగిన.. పాక్ అనుకూలుడిగా పేరు కలిగిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్మీ చీఫ్ను గద్దె దించడానికి.. బంగ్లాదేశ్ సైన్యంలోని నిఘా విభాగం అయిన డీజీఎఫ్ఐ నుంచి మద్దతును తీసుకునేందుకు ఫైజుర్ రెహ్మాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.