బంగ్లాదేశ్ (Bangladesh)లో మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని అమెరికా మేధోమథన సంస్థ గేట్స్టోన్ ఇన్స్టిట్యూట్ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశం ఉగ్రవాద శక్తులకు సురక్షిత స్థావరంగా మారే ప్రమాదం ఉంది.2024 ఆగస్టులో షేక్ హసీనాను గద్దె దింపిన తర్వాత యూనస్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, సామాజిక విచ్ఛిన్నం బంగ్లాదేశ్ను పట్టిపీడిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇస్లామిక్ కఠినవాద శక్తులు బలపడుతున్నాయని, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి సంస్థలు ఖలీఫత్ పాలన కోసం బహిరంగ ర్యాలీలు చేస్తున్నాయని పేర్కొంది.

మైనారిటీలపై దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్యం
హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను రక్షించడంలో యూనస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నివేదికలో పేర్కొంది. 2024లో చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లో చక్మా వర్గానికి చెందిన వంద ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. కానీ బంగ్లాదేశ్ సైన్యం జోక్యం చేసుకోలేదని నివేదిక తీవ్ర విమర్శలు చేసింది.నోబెల్ గ్రహీత అయిన యూనస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని నివేదిక పేర్కొంది. 2024 సెప్టెంబర్లో 9.92 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు 10.87 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 14 శాతం దాటింది. నిత్యావసరాల ధరలు పెరగడంతో లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
భారత్తో సంబంధాలు దెబ్బతిన్నాయి
యూనస్ ప్రభుత్వం విదేశాంగ విధానాల్లో తప్పిదాలు చేస్తోందని నివేదిక తెలిపింది. ముఖ్యమైన పొరుగు దేశం భారత్ను దూరం చేసుకుంటూ, వరదల వంటి సమస్యలకు భారత్ను నిందిస్తున్నారని పేర్కొంది. అదే సమయంలో చైనా, పాకిస్థాన్లతో సంబంధాలను బలపరచడంపై దృష్టి పెట్టిందని విమర్శించింది. 1971 యుద్ధ మారణహోమానికి పాకిస్థాన్ క్షమాపణ చెప్పకపోయినా, ఆ దేశంతో సన్నిహితంగా వ్యవహరించడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని నివేదిక పేర్కొంది.శాంతిభద్రత, పౌరుల రక్షణ, ఆర్థిక నిర్వహణ, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక స్పష్టం చేసింది. ఈ కారణంగా బంగ్లాదేశ్ బలహీనపడి, అంతర్జాతీయంగా ఏకాకిగా మారిందని గేట్స్టోన్ ఇన్స్టిట్యూట్ నివేదికలో పేర్కొంది.
Read Also : GST: జులై నెల జీఎస్టీ వసూళ్లు డేటా