ఉపాధి అవకాశాల పేరుతో లక్షల్లో డబ్బు వసూలు చేసి యువతను విదేశాలకు తరలించే ముఠాలు తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది భారతీయులను కంబోడియా, మయన్మార్ వంటి దేశాలకు తీసుకెళ్లి చైనా ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ ముఠాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.ఈ వ్యవహారం తాజాగా తెలంగాణాలో మరోసారి బయటపడింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధూకర్ రెడ్డి మయన్మార్ చేరిన అనంతరం అక్కడి పరిస్థితులను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే అతని తండ్రి లక్ష్మారెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి తన కుమారుడిని రక్షించేందుకు సహాయం కోరారు. మయన్మార్లోని మైవాడీ జిల్లాలో చైనా ముఠాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారతీయ నిరుద్యోగులు చిక్కుకున్నారని ఆయన వివరించారు.
బండి సంజయ్ చొరవ
ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అక్రమ నిర్బంధంలో ఉన్నవారికి విముక్తి కల్పించారు. అక్రమ నిర్బంధంలో ఉన్నవారిని విముక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంది. బండి సంజయ్ చొరవతో భారత అధికారులు మయన్మార్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో అక్కడి ఆర్మీ వారి అదుపులో ఉన్న బాధితులను స్వదేశానికి పంపించింది. మొత్తం 578 మంది భారతీయులను రెండు ప్రత్యేక విమానాల్లో తిరిగి స్వదేశానికి రప్పించారు.

నకిలీ ఏజెంట్లు
మయన్మార్, కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఈ మానవ అక్రమ రవాణా వ్యవస్థలో ఏజెంట్లు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరుతో రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మయన్మార్ చేరుకున్నాక వారిని 3 వేల డాలర్లకు చైనా ముఠాలకు అమ్మేస్తున్నారు. ఆ తర్వాత బాధితులను సైబర్ నేరాలకు బలవంతంగా ఉపయోగించేందుకు శిక్షణ ఇస్తున్నారు. వీరు సామాన్యుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు దోచేందుకు లేదా ఇతర మోసపూరిత కార్యక్రమాలకు ఉపయోగపడతారు.
దర్యాప్తు
తెలంగాణ, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు వందలాది మంది యువకులను స్వస్థలాలకు రప్పించగలిగారు. అయితే సైబర్ ఫ్రాడ్ కంపెనీలు తాజాగా మయన్మార్ కేంద్రంగా ఉద్యోగాల ఎర వేసి మానవ అక్రమ రవాణాకు నడుం బిగించినట్టుగా తాజా ఘటనతో స్పష్టం అవుతోంది.
చర్యలు
బర్ నేరాలకు పాల్పడేందుకు మయన్మార్ కేంద్రంగా జరుగుతున్న తతంగంపై కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెంట్ల అవతారం ఎత్తి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుపుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. ఈ కేసులో అనుమానితులుగా హితేష్ అర్జన సోమయ, రాజశేఖర్ అలియాన్ రోమన్ లపై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ కూడా మయన్మార్ లోనే ఉన్నారని భావించిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మయన్మార్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన బాధితుల నుండి ఇంటలిజెన్స్ బ్యూరో ,సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ విభాగాల అధికారులు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.