ఇది మనకు నమ్మలేని విషయం కానీ నిజం సూర్యాపేట జిల్లాలోని కోర్టు ఓ దారుణ ఘటనపై సంచలన తీర్పు వెల్లడించింది.2021లో, తాను సొంతంగా కన్నబిడ్డను నరబలిగా అర్పించిన మహిళ బి.భారతికి మరణ శిక్ష పడింది ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.భారతిని ఈ స్థాయికి నెట్టిన కారణం ఆమె నమ్మకం – తనపై ఉన్న సర్పదోషంను పోగొట్టుకోవాలనే ఆలోచన. దాంతో ఆమె భయానక నిర్ణయం తీసుకుంది భర్తపై కూడా గతంలో ఆమె దాడి చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించింది. ఆ నేరం కూడా కోర్టు దృష్టిలో కీలకంగా మారింది ఈ దారుణం మోతే మండలం,మేకలపాటి తండాలో చోటుచేసుకుంది. తేదీ ఏప్రిల్ 15, 2021. భారతి తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తూ, ఏడు నెలల పసికందును తన చేతే గొంతు కోసి చంపింది. అంతే కాదు, ఆ పాప నాలుకను కూడా కోసింది. ఈ దృశ్యం వింటేనే గుండె జలదరించిపోతుంది.అప్పటికి ఇంట్లో ఉన్నవారు భర్త కృష్ణ మరియు అనారోగ్యంతో ఉన్న మామ. బిడ్డ ఏడుస్తున్న శబ్దానికి మామ లేచి చూసినప్పుడు, రక్తపు మరకలతో భారతి బయటికి వస్తూ కనిపించింది.

ఆమె చేతిలో శవాన్ని చూసిన మామ గుబులుపడ్డాడు. “దేవుళ్లకు బలి ఇచ్చాను.ఇక సర్పదోషం పోతుంది” అని ఆమె చెప్పిన మాటలు మామను షాక్కు గురి చేశాయి.ఈ విషయాన్ని కృష్ణకు తెలిపిన మామ, అతను బంధువులకు, పొరుగు వారికి చెప్పాడు.చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.వెంటనే మోతే పోలీసులు కేసు నమోదు చేసి, భారతి అరెస్ట్ చేశారు.కేసులో 10 మంది సాక్షులను విచారించారు.వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా భారతి చర్యలు పూర్తిగా ఉద్దేశపూరితమైనవేనని తేలింది. పైగా, 2023లో భారతి, భర్త నిద్రిస్తున్న సమయంలో తూకం రాయితో అతని తలపై దాడి చేసింది.
ఆ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ కేసులో ఆమెకు అప్పట్లో ఏడాది జైలు శిక్ష పడింది.భారతితో కృష్ణకు సంబంధం, క్లాస్మేట్లుగా మొదలైంది.ఆర్థిక పరిస్థితులు బాగా లేక భారతి మొదట వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ సంబంధాలు కలిసిరాక విడాకులు తీసుకుంది.ఆ తర్వాత 2019లో కృష్ణను పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని, ఖమ్మంలో వైద్యులను కూడా సంప్రదించామని కృష్ణ తెలిపాడు.ప్రస్తుతం భారతి చంచల్గూడ మహిళా జైలులో ఉంది. కోర్టు ఈ కేసును ‘అతిపెద్ద దారుణం’గా పరిగణించి, మరణ శిక్ష విధించింది. ఈ తీర్పు సమాజానికి గట్టిగా శిక్షాభ్యాస సంకేతంగా నిలుస్తుంది.