తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పలు కీలక డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని, ఇతర న్యాయమైన హక్కులను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆశా వర్కర్ల డిమాండ్లు ఏమిటి?
ప్రస్తుతం ఆశా వర్కర్లు ప్రభుత్వం నుంచి చాలా తక్కువ వేతనాన్ని మాత్రమే అందుకుంటున్నారు. వారి ప్రధాన డిమాండ్లు- రూ.18,000 వేతనం – ప్రస్తుతం ఆశా వర్కర్లు తక్కువ మొత్తంలో వేతనం పొందుతున్నారు. వారీ వేతనాన్ని కనీసం రూ.18,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ – కోవిడ్ సమయంలో ఆశా వర్కర్లు అనేక ప్రాణాలకు సేవలు అందించారు. ప్రాణ నష్టం జరిగిన సందర్భాల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించేందుకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. మృతి చెందిన వర్కర్ల కుటుంబాలకు రూ.50,000 సహాయం – విధుల్లో ఉండగా మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50,000 అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత – ఆశా వర్కర్లకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత లేకపోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించాలంటున్నారు. ఆసుపత్రుల్లో ఇతర హెల్త్ వర్కర్లకు లభిస్తున్నట్లు ఆశా వర్కర్లకు కూడా పదోన్నతుల అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని వారు నిర్ణయించారు. అయితే, పెద్ద ఎత్తున వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతి లేకుండా ఈ నిరసన చేపట్టడానికి వీలులేదని వెల్లడించారు.
పోలీసుల చర్యలు:
వేకువజాము నుంచే ఆశా వర్కర్ల నివాస ప్రాంతాల వద్ద పోలీసులు మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రోడ్లు, బస్ స్టేషన్లు, రైలు స్టేషన్ల వద్ద తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లో ధర్నా చేపట్టే అవకాశం ఉన్న వారిని ముందస్తు అరెస్టు చేశారు. నిరసనలను భద్రతా కారణాల పేరుతో అడ్డుకుంటున్నారు. ఆశా వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలను అందించే బాధ్యతను చేపడతారు. గర్భిణీలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ, రక్త పరీక్షలు, వ్యాక్సినేషన్, మాతా-శిశు ఆరోగ్య పథకాలను అమలు చేయడంలో వీరి పాత్ర కీలకం కానీ, తగినంత వేతనం లేకుండా, ప్రభుత్వ అనుసంధానం లేకుండా, ఏదైనా ప్రమాదం జరిగినా కుటుంబానికి భరోసా లేకుండా వారు పనిచేయాల్సి వస్తోంది. కోవిడ్ సమయంలో ఆశా వర్కర్లు చాలా కష్టపడి పని చేసినా, ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, గతంలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, వాటి అమలులో జాప్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి.