TG High court: తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషన్లు కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) తరఫున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపిస్తున్నారు.

కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలు
గత ఏడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ(TGIIC)కి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది. కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి.
ఎన్నో రకాల అరుదైన జంతువులు
వన్య ప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ మూడు లేక్లు ఉన్నాయి. రాక్స్ ఉన్నాయి. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అని కోర్టుకు తెలిపారు.