తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. ఎర్రవెల్లి ఫాంహౌస్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే తమ భవిష్యత్కు రక్షణగా భావిస్తున్నారని ఆయన తెలిపారు.
బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. లక్ష మందితో జరిగే ఈ సభకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. త్వరలో సభా వేదికను ఖరారు చేసి, వేడుకలను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలు స్వయంగా నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వమే బీఆర్ఎస్ అని, ఈ పార్టీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం
ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణను కూడా రూపకల్పన చేశారు. ప్రత్యేకంగా, బీఆర్ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసి, బీఆర్ఎస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

తెలంగాణ సమాజం మొత్తం ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగస్వామ్యమవ్వాలి
సమావేశం ముగింపు సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సమాజం మొత్తం ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగస్వామ్యమవ్వాలని పిలుపునిచ్చారు. వరంగల్ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించి, బీఆర్ఎస్ ప్రజలకు మరింత చేరువ కావాలని కోరారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పోరాటం చేసిన విధంగా, ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ తన కార్యాచరణను మరింత ఉద్ధృతం చేస్తుందని స్పష్టం చేశారు.