ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) ఇటీవల పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, టీటీడీ డిగ్రీ, ఓరియంటల్, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు,జూనియర్ లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు 2025 జూన్ 16 నుండి జూన్ 26 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించబడతాయి అయితే మధ్యలో జూన్ 20, 21, 22 తేదీల్లో మాత్రం పరీక్షలు జరుగవు. ఈ మూడు తేదీలు మినహా మిగతా అన్ని తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం సెషన్లలో రాత పరీక్షలు జరుగుతాయి. ఏ పరీక్ష ఎప్పుడనే వివరాలు ఈ కింది వివరణాత్మక షెడ్యూల్లో తెలుసుకోవచ్చు.
ఎడ్సెట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ ప్రొఫెసర్ గంగాధర్ ఏప్రిల్ 7 (సోమవారం)న విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య ఏవీవీ స్వామి సూచించారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్ధులు తమ నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు బీఏ లేదా బీఎస్సీ లేదా బీసీఏ లేదా బీకాం లేదా బీబీఎమ్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో అభ్యర్ధులు తప్పనిసరిగా 50 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారు 40 శాతం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే జులై 1, 2025వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు తప్పని సరిగా 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 8 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో ఓసీ అభ్యర్థులకు రూ.650, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని వివరించారు.

తెలంగాణ గురుకుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మే నెలాఖరు నాటికి ప్రవేశాలు పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల్లో ఐదోతరగతి ప్రవేశాలకు ఇప్పటికే ప్రవేశ పరీక్ష కూడా పూర్తి చేశారు. అలాగే తొలి, రెండో విడత సీట్ల కేటాయింపులు కూడా జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎస్సీ గురుకుల సొసైటీ బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్ష కూడా పూర్తి చేసింది. త్వరలో సీట్ల కేటాయింపులు చేయనుంది.