Pawan Kalyan : వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదం పొందడం కేవలం పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇది న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం వైపు ఒక చారిత్రాత్మక అడుగు అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీయే పరిపాలన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుందన్నారు.

ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం
సంవత్సరాలుగా, వక్ఫ్ బోర్డుల కార్యకలాపాల గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డు సవాళ్లను పరిష్కరించడం, పారదర్శకతను పెంచడం, వక్ఫ్ ప్రయోజనాలు పేద ముస్లింలకు చేరేలా చూడటం, ముస్లిం మహిళలకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం వైపు ఈ సవరణ ఒక ముఖ్యమైన అడుగు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా, ఈ బిల్లును లోక్సభలో దాదాపు 12 గంటలు, అలాగే రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తిగా చర్చలు జరిగాయని గుర్తు చేశారు.
ముస్లిం సమాజానికి కూడా కృతజ్ఞతలు
ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఇలా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టడంలో మార్గనిర్దేశం చేయడంలో నాయకత్వం వహించినందుకు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల సంక్షేమ మంత్రి కిరణ్ రిజిజు, హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఎన్డీయే నాయకుడు జేపీ నడ్డాలకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సంస్కరణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఎంపీకి, అలాగే వారి మద్దతుకు ముస్లిం సమాజానికి కూడా తాను కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు.