తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది. పార్టీ హైకమాండ్ సంక్రాంతి పండగ తర్వాత ఈ నియామకాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి నేతల పేర్లు అధిష్టానం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపోటములపై కొత్త నాయకత్వం ప్రభావం ఎంత ఉంటుందన్నది హైకమాండ్ పెద్దగా పరిగణనలోకి తీసుకుంటోంది. డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు కూడా రేసులో ఉండగా, నాయకత్వ మార్పు ద్వారా పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో పార్టీకి మరింత ఊతమిచ్చేలా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. కొత్త నాయకుడు ఎవరు అనే చర్చ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఈటల రాజేందర్ గతంలో టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరి చురుకుగా పనిచేస్తుండటం, అరవింద్ పార్లమెంట్ సభ్యుడిగా మంచి ప్రతిష్టను సాధించడాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. రఘునందన్ రావు తన ఆత్మవిశ్వాసంతో మరియు బలమైన ఆవగాహనతో పార్టీకి మద్దతుగా నిలుస్తున్న నేతగా గుర్తింపు పొందారు. నూతన నాయకత్వం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి మరింత బలమైన స్థానం ఏర్పడుతుందనే ఆశాభావం ఉంది.