- జగన్ తన మాటలను వెనక్కి తీసుకోవడం మంచింది
- పోలీసుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తీవ్ర అసహనానికి గురిచేశాయి. విజయవాడ జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు రిటైర్ అయినా సరే, వారిని తీసుకువచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని పోలీసు సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు.

ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్ తన మాటలను వెనక్కి తీసుకోవడం మంచిదని సూచించారు. పోలీసు వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, వారిపై ఈ విధంగా వ్యాఖ్యానించడం అసమంజసమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ ఒక్కటే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. పోలీసుల విధులపై అనవసర విమర్శలు చేయడం ద్వారా, రాజకీయ నాయకులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నం చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు.
జగన్ వ్యాఖ్యలు చట్టవ్యవస్థను తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉన్నాయని, ఇలాంటి మాటల వల్ల ప్రజాస్వామ్యానికి ఏ సంకేతాలు అందుతాయని పోలీసు సంఘం ప్రశ్నించింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత జగన్కు మరింత ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవించే నేతలే ఆదర్శంగా నిలుస్తారని, అలాంటి సంస్కృతిని ప్రోత్సహించాల్సిందిపోయి, బెదిరింపు భాషను ఉపయోగించడం సరికాదని పోలీసు అధికారులు హితవు పలికారు.