Chhattisgarh : మరోసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

మావోయిస్టులకు భారీ నష్టం
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. బీజాపుర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు.