అగ్రరాజ్యం లో వరుసగా విమాన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పది రోజుల క్రితమే మూడు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గురువారం రోజు సియోల్-టకోమా అంతర్జాతీయ విమానంలో రెండు విమానాలు ఢీకొట్టుకోగా.. ఎలాంటి ప్రాణ నష్టమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేడు అమెరికాకు చెందిన మరో విమానం అదృశ్యమైంది. ముఖ్యంగా 9 మంది ప్రయాణికులు, ఒక పైలెట్తో వెళ్తున్న ఈ విమానం గాల్లో ఉండగానే అలస్కాలో గల్లంతు అయ్యింది.అమెరికాలోని బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208 బి గ్రాండ్ కారవాన్ మోడల్ విమానం శుక్రవారం రోజు అదృశ్యం అయింది.గురువారం రోజు సాయంత్ర 4 గంటలకు ఈ విమానం 9 మంది ప్రయాణికులు, ఒక పైలెట్తో ఉనల్కలేట్ నుంచి నోమ్కు వెళ్తోంది. మధ్యాహ్నం 2.37 గంటలకే ప్రయాణం ప్రారంభం కాగా.. 3.16 గంటలకు (మరో 28 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోబోతుందనగా) విమానం అదృశ్యం అయింది. విషయం గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా నార్టోన్ సౌండ్ ఏరియాలో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

అక్కడకు సహాయక బృందాలను పంపించారు. ఈ విషయాన్ని ది అలస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇప్పటికీ విమాన జాడ దొరకలేదని.. రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ను కొనసాగిస్తున్నట్లు వివరించింది. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం కొండలు, గుట్టలు, అటవీ ఎక్కువగా ఉండడం వల్ల విమానాన్ని గుర్తించడం కష్టంగా మారిందని తెలుస్తోంది. రోడ్డు రవాణా కూడా సరిగ్గా లేకపోవడం వల్లే అక్కడి ప్రజలంతా ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని సమాచారం.విమానం అదృశ్యం అయిన విషయం తెలుసుకున్న అమెరికా ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.