కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులు బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని బాచుపల్లి పోలీసులను చక్రధర్ గౌడ్ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంతోష్ కుమార్, హరీష్ రావు, రాములు, వంశీలపై కేసు నమోదైంది.

ఏ2గా హరీష్ రావు
బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం హరీష్ రావు పై 351 (2) R/W 3, (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ -1 వంశీ కృష్ణ, ఏ3 సంతోష్ కుమార్, ఏ4గా పరుశురాములు పేర్లను చేర్చిన పోలీసులు ఏ2గా హరీష్ రావు పేరు చేర్చారు. గతంలో హరీష్ రావుపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేశారు చక్రధర్ గౌడ్. తన ఫోన్ ట్యాప్ చేసి తన భార్యతో, బంధువులతో జరిపిన ఫోన్ సంభాషణలను విన్నారని.. కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు న్యాయస్థానాన్ని సైతం చక్రధర్ గౌడ్ ఆశ్రయించడం తెలిపిందే. తాజాగా హరీష్ రావు సహా కొందరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
జూన్ 19న చక్రధర్గౌడ్ డీజీపీకి ఫిర్యాదు
కాగా, మాజీ మంత్రి హరీష్రావు తన ఫోన్తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లను ట్యాప్ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్గౌడ్ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ అయిందంటూ గత ఏడాది జూన్ 19న చక్రధర్గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు చక్రధర్గౌడ్ను గతంలో విచారించిన పోలీసులు సరైన ఆధారాలు తీసుకు రావాలని సూచించారు.