Anna Konidala : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల (అన్నా లెజినోవా) సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికగా.. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం నుండి అఖిలాండం వద్దకు చేరుకుని అన్నా కొణిదల టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు.

స్కూలు బిల్డింగ్ లో అగ్నిప్రమాదం
ఇటీవల సింగపూర్ సమ్మర్ క్యాంప్ వెకేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదల దంపతుల కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. స్కూలు బిల్డింగ్ లో అగ్నిప్రమాదం సంభవించగా.. ఒకరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు. వారిలో పదిహేను మంది వరకు చిన్నారులు ఉన్నారు. సింగపూర్ అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి మార్క్ శంకర్తో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడింది. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందించారు.
స్వామివారిని దర్శించుకున్న అన్నా కొణిదల
చిరంజీవి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు. తన కుమారుడికి చిన్న ప్రమాదం అనుకున్నాం, కానీ పెద్ద ప్రమాదమే జరిగిందని తరువాత తెలిసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్క్ శంకర్కు డాక్టర్లు బ్రాంకో స్కోపి నిర్వహించారని తెలిపారు. శ్వాసకోశ నాళాలు, ఊపిరితిత్తుల్లో పొగ చేరడంపై డాక్టర్లు ప్రత్యేక పరికరంతో పరీక్షలు చేశారు. దీర్ఘకాలంలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని పవన్ అన్నారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు కుమారుడు మార్క్ శంకర్తో కలిసి ఏపీకి తిరిగొచ్చారు. కుమారుడు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడితే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని అన్నా కొణిదల మొక్కుకున్నారు.