దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఓ జవాన్ (Jawan), తన కుటుంబానికి చెందిన భూమిని వైసీపీ నేతలు (YCP Leaders ) కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ మంత్రి నారా లోకేష్(Lokesh)కు ఫిర్యాదు చేశారు. బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి ప్రస్తుతం కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన భార్య, మామకిచెందిన భూమిని వైసీపీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బలవంతంగా ఆక్రమించాడని నరసింహమూర్తి ఆరోపించారు. కోర్టు తీర్పు, సంబంధిత భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత దాడులు
జవాన్ తెలిపారు ప్రకారం… సర్వే నంబర్లు 366-6, 366-7, 366-8, 366-9 లోని భూమిని సాగు చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, వైసీపీ నేత దాడులకు దిగాడని తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ అనేకసార్లు తిరిగినా స్పందన లేదని, తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దేశం కోసం రేయింబవళ్లు సరిహద్దుల్లో కాపలాకాస్తున్న తాను, తన కుటుంబానికి ఈ దురవస్థ కలుగుతుందంటే బాధ కలుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో, నారా లోకేష్ను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు.
జవాన్ సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ హామీ
ఇటీవల కడప మహానాడు సందర్భంగా కూడా ఈ విషయాన్ని జవాన్ లైవ్గా తెరపైకి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన లోకేష్, వ్యక్తిగతంగా జవాన్ కుటుంబ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో దేశం కోసం కృషి చేస్తున్న సైనికుల కుటుంబాలను కాపాడలేని పరిస్థితి ప్రజాస్వామ్యానికి అపచారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుండటంతో, జవాన్లకు చెందిన భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : Kamal Hassan : కమల్ హాసన్ కు మద్దతు : రామ్ గోపాల్ వర్మ