ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ప్రభుత్వ వనరులను అమ్మడం కాదు, వాటిని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా పూర్తవ్వాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అనుసరించామని తెలిపారు. “గతంలో మెడికల్ కాలేజీల నిర్మాణం దశాబ్దాలుగా ఆలస్యమవుతుండేది. ఇప్పుడు ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యంతో కొద్ది కాలంలోనే అన్ని జిల్లాల్లో మెడికల్ విద్య అందుబాటులోకి రానుంది” అని లోకేశ్ వివరించారు.
లోకేశ్ ప్రకారం, గత ప్రభుత్వ పాలనలో పేద విద్యార్థులకు కేవలం 42% సీట్లు మాత్రమే కేటాయించేవారని, ఇప్పుడు PPP మోడల్లో 50% సీట్లు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వ విద్యార్థులకు కేటాయించనున్నామని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యలో పెద్ద అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. “ప్రభుత్వం భూమి లేదా ఆస్థులను అమ్మడం లేదు. ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలను ప్రైవేట్ పెట్టుబడిదారులతో భాగస్వామ్యంగా ఉపయోగించుకుని విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని చెప్పారు. ఇది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం అని ఆయన నొక్కిచెప్పారు.
ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. “వైసీపీ నాయకులకు అభివృద్ధి అంటే అర్థమే లేదు. పేదలకు మేలు చేసే ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు నిజమైన ముప్పు వైసీపీ తీరుతెన్నుల వల్లే వచ్చింది” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. PPP విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించి, ప్రజా సేవలను విస్తరించవచ్చని ఆయన అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్టు సక్రమంగా అమలు అయితే, ఆంధ్రప్రదేశ్ త్వరలోనే వైద్య విద్యలో స్వయం సమృద్ధిని సాధించగలదని అంచనా.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/