ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి రేషన్ షాపులు (Ration Shops) మళ్లీ తెరుచుకోవడంతో రాష్ట్ర రాజకీయాలలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ప్రజల ఇంటికే రేషన్ అందించే సౌకర్యాన్ని ఎందుకు తొలగిస్తున్నారు?” అంటూ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన డోర్ డెలివరీ విధానం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందాయని ఆయన చెప్పారు.
పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు
జగన్ తన ట్వీట్లో, “పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? మంచిగా ఆలోచించి ప్రజల అవస్థలు తొలగించాలి కానీ, వారికి ఇబ్బందులు కలిగించడం సబబు కాదు” అని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ వాహనాల ద్వారా పేదలకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు చేరుతున్నాయని చెప్పారు. దీని వల్ల వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిందని వివరించారు.
దాదాపు 20వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయారు
ఇంతమంది ఉద్యోగులను నేరుగా ప్రభావితం చేసే విధంగా 9,260 రేషన్ వాహనాలను నిలిపివేయడం వల్ల దాదాపు 20వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకొని, ఇప్పటికే స్థిరపడిన విధానాలను కొనసాగించాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలపై భారం మోపడం తగదని, తక్షణం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also : Dhanush: కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకలో ధనుష్, ఐశ్వర్య