Latest Telugu News : Forest security : ఏదీ ‘అటవీ’ భద్రత?

Read Time:  1 min
FONT SIZE
GET APP

అటవీ రక్షణకు (Forest security)వేలాది కోట్లరూపాయలు వెచ్చిస్తున్నాం, అడవులను ధ్వంసం చేసే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని అటు కేంద్రపాల కులు, ఇటు రాష్ట్రాల పాలకులు ఎన్ని హెచ్చరికలు చేసినా, మరెన్నిప్రకటనలు చేసినా ఆశిం చిన ఫలితాలు లభించడం లేదు. అంతకంతకు అటవీ విధ్వంసం పెరిగి పోతున్నది. కొందరు అధికారులు అవి నీతి, నిర్లక్ష్యం అన్ని టికంటే మించి రాజకీయ జోక్యంతో అటవీ రక్షణ (Forest security) “కోసం ఏర్పాటు చేసుకున్న చట్టాలు నిరు పయోగం అవుతున్నాయి. అరణ్యాలను స్మగ్లర్లు వేట గాళ్లకు వదలి కొందరు అధికారులు జనారణ్యంలో ఉండ డంతో పరిస్థితి అంత కంతకు దిగజారిపోతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు కాకులు దూరని కీకారణ్యాలుగా పేరు పొందిన నల్లమల, దండకారణ్యాలు సైతం మైదానాలుగా మారిపోతున్నాయి. మరొకపక్క ప్రభుత్వాలు కూడా అటవీ విధ్వంసానికి అభివృద్ధి పేరుతో పాల్పడుతున్నాయనే విమర్శలను కొట్టి వేయలేం. రోడ్లు, ప్రాజెక్టులు, గనుల తవ్వకం తదితర అవసరాల కోసం అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేస్తున్నారు. మరొకపక్క పెరుగుతున్న జన అవసరాలు కూడా ముఖ్యంగా వంటచెరుకుకు ప్రధాన ఆధారంగా అడవులే ఉంటున్నాయి. ప్రతిరోజూ భారత్లో మూడవందల ముప్పై ఎకరాలకుపైగా అడవులు అదృశ్య మైపోతున్నాయని గతంలో ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాబోయే రెండు, మూడు దశాబ్దాల్లో ముఖ్యంగా గ్రామీ ణులు అడవులపై వంట చెరుకుకు ఆధారపడాల్సిన పరిస్థితులు పెరుగు తాయని నిపుణులే అభిప్రాయపడు తున్నారు. దీంతో అడవుల నరికివేత మరింత పెరుగు తుందని అంచనా వేస్తున్నారు. ఈ అటవీ సంపద ఇలా అదృశ్యమైపోతుంటే వీటి ఆధారంగా శతాబ్దాల తరబడి జీవనం సాగిస్తున్న పెద్ద పులులు, చిరుత పులులు, దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు, అడవికోళ్లు ఇలా ఒక్కటేమిటి సమస్త వన్యప్రాణులు వేటగాళ్ల బారి నుంచి తప్పించుకోలేక కాల గర్భంలో కలిసిపోతున్నాయి. అడ వుల విస్తీర్ణం తగ్గడం, స్మగ్లర్ల కార్యకలాపాలు పెరగడంతో ఈ వన్యప్రాణులు అక్కడ ఆహారం దొరకక జనారణ్యం లోకి చొచ్చుకు వస్తు న్నాయి. ఇటీవల అనేక ప్రాంతాల్లో గ్రామాల్లోకి పులులు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, తదితర వన్యప్రాణులు ఎన్నో జనారణ్యంలోకి చొచ్చుకువచ్చి ఆహారం కోసం రైతుల పంటలపై పడుతు న్నాయి. శ్రీకాకుళం తదితర ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాయల సీమలోని చిత్తూరు ప్రాంతంలో అడవి ఏనుగుల గుంపులు చొచ్చుకువస్తున్నాయి. దీంతో ఎన్నో వ్యయప్రయాసల కు ఓర్చి సాగు చేసుకున్న పంటలు నోటికి అందుతున్న దశలో వన్యప్రాణులు ధ్వంసంచేస్తున్నాయి. కొన్నిప్రాంతాల్లో రైతులపై కూడా దాడులు చేస్తున్నాయి. మొన్న తెలంగాణలో పులిదాడిలో అన్నదాత ఒకరు అసువులు బాశారు. ఇలాంటి సంఘటనలు తరుచుగా చోటు చేసు కుంటున్నాయి. దీంతో కొన్నిప్రాంతాల్లో క్రిమిసంహారక మందుల ప్రయోగంతోనో, కరెంటు తీగలుపెట్టి వన్య ప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. ఇక రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లూరు, తదితర జిల్లాల్లో ఎర్రచంద నం కోసం స్మగ్లర్లు చేస్తున్న ఆగడాలకు అంతే లేకుండాపోతున్నది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసికాల్పులు జరుపుతున్నా ప్రాణాలు కూడా లెక్క చేయ కుండా స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. అత్యంత విలువైన ఈఅటవీ సంపద కేవలం నెల్లూరు, చిత్తూరు, కడప సరి హద్దుల్లోని వెలుగొండలు, శేషాచలం అడువుల్లో మాత్రమే దొరుకుతాయి. అందుకు కారణం ఏమిటో కొన్నివందల సంవత్స రాలుగా పరిశోధనలు చేసినా వృక్షశాస్త్రజ్ఞులు కనుగొన లేకపోయారు. గతంలో ఒకసారి బ్రిటిష్పాలకులు ఇంగ్లాండు తీసుకువెళ్లి అక్కడ పెంచే ప్రయత్నంలో కూడా సఫలీకృతం కాలేదు. ఈ అరుదైన వృక్ష సంపదను కాపా డేందుకు 1973లో (కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేండ్ ఇన్ఎన్ డేంజర్డ్ స్పీసిస్) లోకి చేర్చారు. దాంతో ఎర్రచందనం ఎగుమతులపై నిషేధం అమలులోకి వచ్చింది. పరిమితిగా ఉన్న వృక్షాలను సంరక్షించుకునేం దుకు వెసులుబాటు లభించింది. అయినా ఆనాటి నుంచి ఏదోఒక రూపంలో ఇది ముఖ్యంగా జపాన్లాంటి దేశా లకు ఎగుమతి అవుతూనేఉంది. సముద్ర మార్గం ద్వారా దేశసరిహద్దులు దాటించేందుకు ఎప్పటికప్పుడు కొత్త విభాగాలు అనుసరిస్తూనే ఉన్నారు. రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ అక్రమ రవాణా సాగుతూనే ఉంది. మొన్న ఢిల్లీలో దాదాపు ఎనిమిదికోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను అధికారులు కనుగొన్నా రు. మూలాలు ఆంధ్ర ప్రదేశ్నుం చే ఉన్నాయి. ఢిల్లీ, చండీగడ్ లోని గోదాముల్లో దాచిన సరుకును సమయం చూసి నేపాల్కు తరలించి అక్కడి నుంచి చైనాకు చేరవేస్తున్నారు. మణిపూర్, మిజో రం రాష్ట్రాలు ఈ అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయాయి. అయితే ఈ అక్రమ రవాణాను ఆపేందుకు గతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించి భద్ర తను కట్టుదిట్టం చేశారు. జరిపిన కాల్పుల్లో ఆనాడు ఇరవైమందికిపైగా కూలీలు చనిపోయారు. స్మగ్లర్ల పదఘట్ట నలతో నల్లమల, శేషాచలం అడువులు నేటికీ అతలాకుతలం అవుతున్నాయి.ఓకపక్క అడువులు తగ్గిపోతున్నాయి. మరొకపక్క విషప్రయోగాలతో వన్యప్రాణులను మట్టుబెట్టే కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అడవులను, వాటి ఆధారంగా జీవనం సాగిస్తు న్న వన్యప్రాణులను కాపాడేందుకు త్రికరణశుద్ధిగా అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరగాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.