చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వలననే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆయనను ఆకాశానికెత్తి పొగిడారు.లోకేశ్ (Nara Lokesh) మాట్లాడుతూ – సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోలు, రాజకీయాలు… ఏ రంగంలో చూసినా బాలయ్యే నంబర్ వన్. స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఏకైక హీరో బాలయ్య. హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ మాస్ మహారాజ్కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు” అన్నారు.1974లో తాతమ్మ కలతో ప్రారంభమైన సినీ ప్రయాణం నేటి అఖండ 2 వరకు కొనసాగిందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికీ వయసు పెరుగుతుంది కానీ బాలయ్యకు క్రేజ్ మాత్రమే పెరుగుతుంది. ఇప్పటివరకు 109 సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు వందరోజులు కాదు, వేలరోజులు కూడా ఆడాయి అని లోకేశ్ ప్రశంసించారు.
ప్రతి జానర్లో మెరిసిన నటుడు
ఎవరైనా ఒక జానర్లో సక్సెస్ అవుతారు. కానీ అన్ని జానర్స్లో సత్తా చాటిన కథానాయకుడు బాలయ్య మాత్రమే. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సైన్స్ ఫిక్షన్… ఏ రకమైన పాత్రలోనైనా ఆయనదే విజయగాధ. గౌతమీపుత్ర శాతకర్ణిలో శాతకర్ణి అవతారం ఎత్తినా, అఖండలో అఘోర అవతారం ధరించినా ప్రేక్షకులు బాలయ్యను గర్జించారు.రాముడు, కృష్ణుడి రూపం ఎన్టీఆర్ గారి ద్వారా చూసాం. అదే అందం, అదే నటన మళ్లీ బాలయ్య బాబులో ప్రత్యక్షమైంది. శ్రీరామరాజ్యంతో ఆయన మళ్లీ ఎన్టీఆర్ జ్ఞాపకాలను తేవగలిగారు అని లోకేశ్ వివరించారు.
ఓటిటీలోనూ అన్స్టాపబుల్
సినిమా పరిశ్రమను ప్రేమించే హీరోగా బాలయ్య ఎప్పుడూ ముందుంటారని లోకేశ్ అన్నారు. తన సినిమాలకే కాకుండా, మొత్తం పరిశ్రమ బాగుండాలని కోరుకునే హీరో ఆయనే. ఇప్పుడు ఓటిటీలో కూడా అదరగొడుతున్నారు.బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షో రేటింగ్స్ ఆకాశాన్ని తాకాయి. ప్రేక్షకులకు ఆయన అందించిన వినోదం అద్భుతం. ఓటిటీలో కూడా తనదైన ముద్ర వేసి బాలయ్య సత్తా చాటారు. మూడు నంది అవార్డులు, అనేక అంతర్జాతీయ అవార్డులు ఆయనకు దక్కాయి అని అన్నారు.
భోళా శంకరుడిలా సాయమందించే హృదయం
బాలయ్య అంటే భోళా శంకరుడు. స్వచ్చమైన మనసుతో, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి. ఎటువంటి దాపరికం లేదు. ఏ సమస్య వచ్చినా ముందడుగు వేస్తారు. 2009 కృష్ణా వరదల్లో ఆయన చేసిన సహాయం అందరికీ గుర్తుంది.కరోనా సమయంలో ధైర్యంగా అఖండ సినిమా పూర్తి చేసి, ఇండస్ట్రీకి ధైర్యం నింపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరో 25 లక్షలు కరోనా సహాయం కోసం అందజేశారు” అని లోకేశ్ వివరించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినీనటి జయసుధ, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకలో బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందడం తెలుగు రాష్ట్రాల గర్వకారణంగా నిలిచింది.
Read Also :