వెదురుబుట్టలు, విసనకర్రలు తయారు చేసి అమ్ముతూ ఉపాధి
అమరావతి: శ్రీకాకుళంలోని మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కు వలసొచ్చి బుట్టలు నేస్తూ జీవిస్తోన్న ఓ వృద్ధుడి కథ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కదిలించింది. ‘ఈయన కథ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనితీరుకి నిదర్శనం. అవకాశాల కోసం ఊరు వదిలిపెట్టడం బాధాకరం. హస్తకళలను నేను ఎంతో ఆరాధిస్తా. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అవకాశాలు సృష్టిస్తాం. ఆయనలాంటి ప్రతిభావంతులు ఇక్కడే అభివృద్ధి చెందుతారు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా, హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవిస్తున్న వైనాన్ని హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది.
ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం
ఇది ఒక స్ఫూర్తిదాయక జీవితపాఠం అని కొనియాడారు. అతడి కథను పరిశీలిస్తే కష్టించి పనిచేసే స్వభావం, ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. కానీ, అతడు సొంతగడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావహ దృక్పథం బాగా నచ్చాయని… తన కలలను, కళను కలగలిపి వస్తువులుగా మలిచి జీవనం సాగిస్తుండడాన్ని ప్రగాఢంగా అభిమానిస్తున్నానని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్ నిర్మించడానికి, అవకాశాలను సృష్టించడానికి కృషి చేస్తోంది. ఆ వ్యక్తిలా నైపుణ్యం ఉన్న వారు స్వస్థలంలోనే ఉంటే ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తాం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.