రాయపాటి శైలజ ఆవేదనకు కారణమైన సంఘటన ఒక ప్రముఖ టీవీ ఛానల్కి చెందిన జర్నలిస్టుల వ్యాఖ్యల నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యాఖ్యలలో గుంటూరులో ఉన్న మహిళలపై, ఫీమేల్ సెక్స్ వర్కర్లను ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వినియోగించడం మాత్రమే కాకుండా, ప్రాంతాన్ని, కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర నిరసనకు దారితీసింది.

అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శ
ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గుంటూరులో 150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని, అవి ఫీమేల్ సెక్స్ వర్కర్స్తో రిజిస్టర్ అయి పనిచేస్తున్నాయని ఓ జర్నలిస్టు అన్నారు. ఇది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా ప్రకారం ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జీఓలు వారితో పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ వీళ్లు రాజకీయ కారణాలతో దాన్ని వాడుకుని ఒక ప్రాంత మహిళలను అవమానించడం చాలా తప్పు అని శైలజ అన్నారు.
బాధ్యతాయుతమైన మీడియా అవసరం
మీడియా ప్రభుత్వాల మీద విమర్శలు చేయాలి. మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజల పక్షాన నిలవాలి, ప్రభుత్వంలోని మంచి చెడులను ప్రజలకు చేరవేయాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల నీడలో నడిచే ఛానళ్లు సమాజానికి చాలా ప్రమాదకరం. గతంలో రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని కొన్ని మీడియా ఛానళ్లు అంటే, ఆ రైతులే నా మీదకు దాడికి వచ్చారంటూ ఒక జర్నలిస్ట్ రైతులపై కేసు పెట్టారు. రెచ్చగొట్టడం ఎందుకు, మళ్లీ వాళ్లపై కేసులు పెట్టడం ఎందుకు? పొరపాటు జరిగిందని చెప్పాలి కదా” అని శైలజ ప్రశ్నించారు.
చట్టపరమైన చర్యలు, విచారణ
ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ చురుకైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వాలు గానీ, ఎన్జీఓలు గానీ ఎవరైనా సరే, ఇంగ్లీషులో ‘ప్రాస్టిట్యూట్స్’ అనో, తెలుగులో ‘వేశ్యలు’ అనో ఎక్కడా వాడరని, ‘సెక్స్ వర్కర్స్’ అనే పదాన్నే ఉపయోగిస్తారని శైలజ స్పష్టం చేశారు. “అలాంటిది, మహిళలు, పిల్లలు చూసే ఒక పబ్లిక్ ఛానల్లో ఆ పదం వాడారంటే అది ఎంత అవమానకరం? అమరావతి ప్రాంత ఆడవాళ్లు ఏం పాపం చేశారు? ప్రభుత్వం అడిగితే రాజధాని కోసం భూములిచ్చారు, త్యాగం చేశారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా గత ఐదేళ్లలో వాళ్లు రోడ్లెక్కారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ, మహిళా కమిషన్ చుట్టూ తిరిగారు. ఎక్కడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారి, అమరావతి అభివృద్ధి దిశగా అడుగులేస్తుంటే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఎవరూ వాడని మాటలతో వాళ్లను కన్నీళ్లు పెట్టేలా చేశారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ మహిళా కమిషన్కు నివేదన
ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని భావించిన శైలజ, జాతీయ మహిళా కమిషన్కు కూడా లేఖ రాసినట్టు తెలిపారు. వాళ్లు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వానికి లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాసి, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరాను. అధికారాలను దుర్వినియోగం చేయకూడదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాసి, మీడియా ఛానల్ అండ చూసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవారిపై, అవసరమైతే ఆ ఛానళ్లను మూసివేసే అధికారం కూడా ప్రెస్ కౌన్సిల్కు ఉంది, చర్యలు తీసుకోమని మేం సూచిస్తాం” అని శైలజ వివరించారు.
మహిళా కమిషన్కు నేరుగా అరెస్ట్ చేసే అధికారాలు లేవని, చట్ట ప్రకారం ఎస్పీ లేదా డీజీపీకి చర్యలు తీసుకోమని చెప్పగలమని అన్నారు. “మాకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా లేదా సుమోటోగా కేసు తీసుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, ఫిర్యాదుదారులను పిలిపించి విచారించే అధికారం మాకుంది.
మౌలిక గౌరవానికి సంఘటిత సమాజం
ఈ పరిణామాలపై సామాజిక మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రజలు స్పందిస్తున్నారు. ఈ కేసులో రెండో వ్యక్తికి, అలాగే సాక్షి మీడియా యాజమాన్యానికి, చీఫ్ ఎడిటర్కు సమన్లు సిద్ధమవుతున్నాయని శైలజ వెల్లడించారు. “నిజంగా మహిళల గురించి అంత కన్సర్న్ ఉంటే, ‘మా ఛానల్ తప్పు చేసింది, క్షమాపణ కోరుతున్నాం’ అని ఒక మాట చెప్పొచ్చు కదా? అది చేయకుండా, అసలు విషయం నుంచి దృష్టి మళ్లించడానికి ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడుతున్నారు” అని ఆమె విమర్శించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.