తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా రాజకీయ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy)పై పోలీసు కేసు నమోదైంది. ఆలయ నియమాలను ఉల్లంఘించినందుకు ఆయనపై తిరుమల వన్టౌన్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం మీడియా ముందు రాజకీయ వ్యాఖ్యలు
ఆదివారం ఉదయం రవీంద్రనాథ్ రెడ్డి(Ravindranath Reddy) శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేసిన కొన్ని రాజకీయ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. తిరుమల (Tirumala)క్షేత్రం లోపల లేదా పరిసరాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయరాదన్న టీటీడీ నిబంధనలను ఆయన విస్మరించారని ఆరోపణలు వచ్చాయి.
టీటీడీ తీర్మానం మేరకు నిబంధనల ఉల్లంఘన
టీటీడీ పాలకమండలి 2023 నవంబర్ 18న తీసుకున్న తీర్మానం ప్రకారం, తిరుమలలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు(Political speeches), విద్వేషపూరిత వ్యాఖ్యలు నిషేధించబడ్డాయి. ఈ నిబంధనలు ఆలయ గౌరవాన్ని, భక్తుల శ్రద్ధను కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలలో భాగం. అయితే, రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఈ నియమావళిని ఉల్లంఘించాయని టీటీడీ విజిలెన్స్ విభాగం అభిప్రాయపడింది.
పోలీసులకు అధికారిక ఫిర్యాదు, కేసు నమోదు
ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారి దామోదర్, అదే రోజు రాత్రి తిరుమల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్-1994, ఎండోమెంట్స్ యాక్ట్-1984, మరియు భారతీయ న్యాయ విధానం (బీఎన్ఎస్) సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని ఆలయ అధికారులు పునరుద్ఘాటిస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ, ఆలయ నియమాలను పాటించాలన్నదే టీటీడీ విజ్ఞప్తి.
Read hindi news:hindi.vaartha.com
Read also: