News Telugu: భారత సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల దేశవ్యాప్తంగా హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీలపై ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేస్తూ, అందులో ముగ్గురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తరలించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ఆధ్వర్యంలో కొలీజియం సమావేశం ఆమోదించింది.
ఏపీ హైకోర్టుకు రానున్న ముగ్గురు
ఈ జాబితాలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శుభేందు సమంత ఉన్నారు. వీరి బదిలీపై రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన వెంటనే వారు ఏపీ హైకోర్టు (AP High Court)లో బాధ్యతలు స్వీకరించనున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే కావడం.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ – విజయనగరం సంతతి
విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ (Manavendranath Roy), విశాఖపట్నంలోని ఎంవీపీ లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1988లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, 2002లో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్గా 2015 నుండి 2018 వరకు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2019లో ఏపీ హైకోర్టులో జడ్జిగా నియమితులై, ఆపై గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మరోసారి స్వరాష్ట్ర హైకోర్టుకు తిరిగి రానున్నారు.
జస్టిస్ డి. రమేశ్ – చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయవేత్త
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని కమ్మపల్లికి చెందిన జస్టిస్ డి. రమేశ్, నెల్లూరులోని వీఆర్ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1990లో న్యాయవాదిగా చేరిన ఆయన, ప్రభుత్వ న్యాయవాదిగా, అలాగే స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. 2020లో ఏపీ హైకోర్టులో జడ్జిగా నియమితులై, 2023లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీ హైకోర్టులో సేవలు అందించనున్నారు.
జస్టిస్ శుభేందు సమంత – పశ్చిమ బెంగాల్కు చెందినవారు
పశ్చిమ బెంగాల్కు చెందిన జస్టిస్ శుభేందు సమంత, కోల్కతా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను పూర్తిచేశారు. తమ్లుక్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి, తరువాత న్యాయాధికారిగా నియమితులయ్యారు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా, అలాగే కోల్కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా సేవలందించారు. 2022లో ఆయనను కోల్కతా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: