కడపలో జరుగుతున్న మహానాడు (Mahanadu) వేదికగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ హయాంలో తల్లులను అసెంబ్లీ సాక్షిగా అవమానించారని ఆరోపించారు. తల్లిని, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేశారంటూ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2021లో అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై జరిగిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అప్పట్లో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాన్ని గుర్తు చేశారు. “తల్లులను అవమానించినవారికి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలా రాజా?” అంటూ లోకేష్ తీవ్రంగా స్పందించారు.
టీడీపీ శాసనాలు – ప్రజల సంక్షేమమే లక్ష్యం
మహానాడు తొలి రోజున నారా లోకేష్ ఆరు ముఖ్య శాసనాలను ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగళం, అన్నదాతకు అండగా, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, కార్యకర్తలే అధినేత అనే అంశాలపై ఈ శాసనాలు రూపొందించారు. రాబోయే రోజుల్లో వీటిని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. పార్టీలో కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత, మహిళా శక్తికి దక్కాల్సిన గౌరవం, యువతకు అవకాశాలు కల్పించే దిశగా తమ దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.
పసుపు జెండాకు న్యాయం చేసిన కార్యకర్తలు
ఎన్ని ఆటుపోట్లలోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండాను ఎగురవేస్తూ నిలబడ్డారన్న నారా లోకేష్, వారికి శిరసునమి పాదాభివందనాలు తెలిపారు. 43 ఏళ్ల పార్టీ ప్రయాణంలో పార్టీ ఎన్నో విజయాలు, ఓటములు చూసిందని చెప్పారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీకి ప్రభుత్వ పరిపాలన అంతా కొత్తేం కాదన్నారు. ప్రజల అవసరాలు మారుతున్న నేపథ్యంలో పార్టీ కూడా తగిన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహానాడు వేదికగా నూతన దిశలో పార్టీ అడుగులు వేస్తోందని అన్నారు.
Read Also : Apple Products : ఆపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్