ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) భేటీలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఆర్థిక వనరుగా మార్చుకోవాలని, అందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే 15 ఏళ్లలో పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ. 1,000 కోట్ల ఆదాయం లభించేలా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ఆయన లక్ష్యాన్ని నిర్దేశించారు.
Uttar Pradesh: వివిధ కారణాల వల్ల 2.8 కోట్ల ఓట్లు రద్దు
ఈ ప్రణాళికలో భాగంగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ను ఒక మోడల్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక్కడ సుమారు 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్ను అభివృద్ధి చేసి, పర్యాటకులకు ప్రపంచ స్థాయి వసతులు కల్పించనున్నారు. అలాగే, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని చిన్న చిన్న ద్వీపాలను (Islands) బీచ్ టూరిజం ప్రాజెక్టుల కింద అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పర్యాటకులు కేవలం వచ్చి వెళ్లేలా కాకుండా, అక్కడ బస చేసి ప్రకృతిని ఆస్వాదించేలా రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలిపి పర్యాటక క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకుల సంఖ్యను పెంచవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పాపికొండలు-పోలవరం, కోనసీమ అందాలు, పులికాట్ సరస్సు, విశాఖ తీరం మరియు రాయలసీమలోని అనంతపురం – గండికోట వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్యాకేజీలను రూపొందించనున్నారు. గండికోటను ‘గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా’గా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, అలాగే విశాఖను గ్లోబల్ టూరిజం హబ్గా మార్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం ద్వారా వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com