ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) రాష్ట్ర ఎంపీలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత 11 ఏళ్లైనా రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయమై ఇప్పటికీ పురోగతి లేకపోవడాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ఎత్తిచూపారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను తీసుకువెళ్లే సత్తా ఈ ఎంపీలకు లేదని విమర్శించారు.
ప్రత్యేక హోదాపై తాడోపేడో తేల్చాలని డిమాండ్
“పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రం తరపున గళమెత్తే సాహసం కూడా లేకపోతే, అటువంటి ఎంపీలు ఎందుకే?” అని షర్మిల ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా హోదా కూడా రాలేదని, స్పెషల్ ప్యాకేజీ అంశం కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. ఎంపీలకు నిజంగా ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే హోదా అంశంపై తాడోపేడో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజల పక్షాన నిలబడి సభ స్తంభించేలా పోరాటం చేయాలి
షర్మిల ఎంపీలకు ప్రజల పక్షాన నిలబడే బాధ్యత ఉందని గుర్తు చేశారు. “పబ్లిక్ కోసం నిజంగా పనిచేయాలంటే, పార్లమెంట్ సభను స్తంభించేలాగా పోరాడాలి. ప్రధాని మోదీ మెప్పు కోసం కూర్చొనడం కాదు,” అని వ్యాఖ్యానించారు. విభజన హామీలు ఇంకా నెరవేర్చకపోతే, ఎంపీలు కలిసికట్టుగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Read Also : OBC : ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ OBCలకు రిజర్వేషన్లు ఇవ్వాలి – రాహుల్