విజయవాడ : గిన్నిస్ (Guinness) రికార్డుల్లో మెగా పీటీఎంకు స్థానం దక్కిందని మానవవనరుల శాఖా మంత్రి నారాలోకేష్ తెలిపారు. 53.4 లక్షల పేరెంట్స్, టీచర్స్ పాల్గొన్న అతిపెద్ద పీటీఎంగా రికార్డ్ సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 1.5 కోట్ల మంది హాజరయినట్లు మంత్రి లోకేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్ సాధనలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితం అని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎంలో 5.34 మిలియన్ల (53.4 లక్షలు) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 15.2 మిలియన్ల (1.5 కోట్లు) మంది అతిపెద్ద పేరెంటీచర్ మీటింగులో భాగమయ్యారు.

జాతీయ విద్యా విధానం ఐదవ వార్షికోత్సవం జూలై 29కి ఒక రోజు ముందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయిప్రమాణాలను తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహంగా నిలిచిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు లీనిబితి శిగిలీని విజయవంతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ అరుదైన రికార్డు సాధనలో భాగమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విద్యా వికాసానికి, సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ చేస్తున్న కృషిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించడం హర్షనీయమన్నారు. మెగా పిటిఎం నుండి సేకరించిన డేటాను నిశితంగా ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డు అధికారికంగా గిన్నిస్ రికార్డు బృందం ధ్రువీకరించింది. ఇందులో మూడు ఫోటోగ్రాఫ్లు, ఒక వీడియో, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సంఖ్య మరియు ప్రతి పాల్గొన్న పాఠశాల నుండి ఇండిపెండెంట్ విట్నెస్ ద్వారా డేటాను ఎల్ఎఎపి యాప్ ద్వారా సేకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు ఈ అవార్డును నిర్ధారించడానికి 61000 పాఠశాలల నుండి సేకరించిన డేటాను విశ్లేషించారు. అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవపత్రం ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Justice : హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్