గుజరాత్లోని అర్వల్లి జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మోడసా పట్టణ సమీపంలో తెల్లవారుజామున ఒక అంబులెన్స్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువు, ఓ వైద్యుడు, ఒక నర్సు మరియు శిశువు తండ్రి ఉన్నారు. చిన్నారికి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం మోడసాలోని ఆస్పత్రి నుంచి అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈ అంబులెన్స్లో తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో మోడసా-ధన్సురా జాతీయ రహదారిపై అంబులెన్స్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Ibomma Ravi : ఈడీ చేతికి ఐబొమ్మ రవి కేసు
అంబులెన్స్లో మంటలు చెలరేగిన సమయంలో శిశువు తండ్రి జిగ్నేష్ మోచి (38), వైద్యుడు శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మనత్ (23) ఉన్నారు. మంటల తీవ్రత అత్యధికంగా ఉండటంతో వీరంతా వాహనం లోపలే సజీవదహనం అయ్యారు. చిన్నారితో కలిపి మొత్తం నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అయితే, అంబులెన్స్ డ్రైవర్ మరియు మరో ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక వైద్య బృందం మెరుగైన వైద్యం కోసం వెళ్తుండగా ఇలా జరగడం స్థానికంగా కలకలం రేపింది.

అంత్యంత సున్నితమైన వైద్య సేవల్లో వినియోగించే అంబులెన్స్లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంబులెన్స్ ఇంజిన్లో సాంకేతిక లోపం, షార్ట్ సర్క్యూట్ లేదా అధిక వేడి వంటివి ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంబులెన్స్లో అగ్ని ప్రమాదం జరిగిన తీరు, మంటలు వ్యాపించిన సమయం తదితర వివరాలను సేకరించి, దీనికి కారణమైన అంశాలను విశ్లేషిస్తున్నారు. అగ్నిమాపక దళం చేరుకునేలోపే ప్రమాదం జరగడంతో నలుగురి ప్రాణాలను కాపాడలేకపోవడం దురదృష్టకరం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/