ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పలు కీలక సూచనలు చేశారు. అన్ని మండలాల్లో జనరిక్ ఔషధాల దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది పేదలకు భారం తగ్గించడమే కాక, బీసీ యువతకు ఉపాధి అవకాశాలకూ దారితీస్తుంది.ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు కింద అందుతున్న వైద్య బీమా (Medical insurance) మొత్తాన్ని ₹25 లక్షల వరకు పెంచే అంశాన్ని సమీక్షించారు. ప్రస్తుత వ్యవస్థలో 1.43 కోట్ల కుటుంబాలకు బీమా అందుతోంది. ఇప్పుడు దీన్ని 1.63 కోట్ల కుటుంబాలకు విస్తరించాలన్నది సీఎం సూచన. ఇది 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే అవకాశం కల్పిస్తుంది.ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో మెడికల్ కళాశాలల నిర్మాణం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రతి 1,000 మందికి 2.24 పడకలే ఉండగా, డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శక ప్రకారం ఇది 3 ఉండాలి. ఇందుకోసం రాష్ట్రానికి మరో 12,756 పడకల అవసరం ఉంది.
ఆరోగ్యపు అవగాహన పెంచే కార్యక్రమాలు
ప్రజలు అనారోగ్యం పాలవ్వక ముందే జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. యోగా, నేచురోపతికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ‘యోగా ప్రచార పరిషత్’ ఏర్పాటు చేయాలని, 3 రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది నియమించాలని ఆదేశించారు. అమరావతిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అన్నారు.ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. 45 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం లాంటి ప్రాంతాల్లో ల్యాబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. శాంపిల్ కలెక్షన్ టీమ్ల సంఖ్యను కూడా పెంచనున్నారు.ప్రతి గ్రామానికి ‘ఆరోగ్య రథం’ ద్వారా మొబైల్ వైద్యసేవలు అందించాలని సీఎం తెలిపారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ తప్పనిసరి చేశారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకానికి సంబంధించిన కిట్స్ను పరిశీలించి, తక్షణమే అమలులోకి తీసుకురావాలని సూచించారు.
అమరావతి – మోడల్ ఇంక్లూజివ్ సిటీగా రూపుదిద్దుకోనుంది
పెర్కిన్స్ ఇండియా, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అమరావతిని మోడల్ ఇంక్లూజివ్ సిటిగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అందరికీ అందుబాటులో మౌలిక వసతులు, బారియర్ ఫ్రీ పబ్లిక్ ప్లేసులు, డిజిటల్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఈ చర్యలన్నీ ప్రజల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడమే కాకుండా, రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు తగినట్టు తీర్చిదిద్దే దిశగా ఉన్నాయి.
Read Also :