ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూములను ఇచ్చిన రైతులకు నేడు రిటర్నబుల్ ప్లాట్లను(Returnable plots) కేటాయించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ క్రమంలో విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 15 గ్రామాలకు చెందిన 119 మంది రైతులకు మొత్తం 304 ప్లాట్లు అందజేయనున్నారు. ఆన్లైన్ ర్యాండమ్ అల్గోరిథం సిస్టమ్ ద్వారా పారదర్శకంగా ఈ కేటాయింపు జరగనుంది.
రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు
ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడతలో కృష్ణాయపాలెం, పెనుమాక, నిడమర్రు (1, 2), నవులూరు (1, 2) గ్రామాలకు చెందిన రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుళ్లూరు (1, 2), అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, వెంకటపాలెం, మందడం (1, 2), శాఖమూరు గ్రామాల రైతులకు కూడా అదే విధంగా ప్లాట్లు పంపిణీ చేస్తారు. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జరుగుతుండటం విశేషం.
రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామన్న హామీ
రైతులు ఇచ్చిన భూమికి గాను రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామన్న హామీని అమలు చేసే దిశగా ఈ లాటరీ ప్రోగ్రాం ఒక ముఖ్యమైన మెట్టు. చాలా కాలంగా భూసమర్పణ చేసిన రైతులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈ చర్య వారికి న్యాయం జరిగిందనే భావనను కలిగిస్తుంది. అమరావతి ప్రాంత అభివృద్ధికి కేంద్రంగా ఉన్న ఈ గ్రామాల రైతులు, ఈ-లాటరీ ద్వారా తమకు అంచనా వేసిన స్థలాన్ని పొందగలగడం ద్వారా భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు అవుతారు.
Read Also : Stampede : దేశ క్రీడా చరిత్రలో అతిపెద్ద విషాదం ఇదే