ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మరో కీలక అడుగు వేసింది. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకగా ప్రవేశపెట్టిన ‘అన్న క్యాంటీన్ల’ను ఇకపై గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సేవలను, ఉగాది పర్వదినం సందర్భంగా మండల కేంద్రాల్లోనూ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 75 కొత్త క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
Read Also : Botsa Satyanarayana: మళ్లీ అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, అన్న క్యాంటీన్ల విస్తరణ ద్వారా సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ. 65 లక్షలు ఖర్చు చేస్తోంది. నాణ్యమైన టిఫిన్, భోజనాన్ని కేవలం రూ. 5లకే అందించడం ద్వారా ఇప్పటికే పట్టణాల్లోని పేదలకు, కార్మికులకు గొప్ప ఊరట లభిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా 205 క్యాంటీన్లను పునరుద్ధరించగా, సుమారు 3.07 కోట్ల మంది వీటి ద్వారా ప్రయోజనం పొందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Read Also : Gold Rate Today: మరోసారి తగ్గిన పసిడి ధరలు
నిజానికి ఈ పథకాన్ని సంక్రాంతి నాటికే గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచించినప్పటికీ, నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఉగాదికి వాయిదా పడింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక అన్న క్యాంటీన్ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దశల వారీగా మండల కేంద్రాలన్నింటినీ ఈ పథకం కిందకు తీసుకువచ్చేలా కసరత్తు చేస్తోంది. ఉగాది వేళ ఈ కొత్త క్యాంటీన్లు ప్రారంభమైతే, పట్టణాలకు వెళ్లే పని లేకుండానే పల్లెల్లోని పేదలకు కూడా నాణ్యమైన ఆహారం అతి తక్కువ ధరకే లభిస్తుందని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.