ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
విజయవాడ : అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా సరే తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసం.. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra babu) సమీక్షించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఇన్ఫ్రా, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ వంటి అంశాల్లో గేట్స్ ఫౌండేషనుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆయా రంగాల్లో టెక్నాలజీని (Technology) వినియోగించుకుని ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసే అంశంపై గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి, పురోగతి వంటి అంశాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra babu) మాట్లాడుతూ.. “ప్రస్తుత యుగంలో టెక్నాలజీ పెద్దఎత్తున అందుబాటులో ఉంది.

టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రభుత్వ సేవల వేగవంతమైన ప్రదర్శన
టెక్నాలజీ ద్వారా చాలా వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయగలుగుతున్నాం అన్నారు. అయితే ఆ టెక్నాలజీ ప్రజలకు ఎంతవరకు చేరువ చేయగలిగామనేదే ప్రధానం అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలందిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నాటికి.. దాదాపు 95 నుంచి 97 శాతం ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్ లైనులోనే అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ (Bill Gates Foundation) వద్ద ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుసరించే విధానాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. అలాగే టెక్నాలజీ పరంగా ఆయా అంశాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలోనూ వారికి నైపుణ్యం ఉంది. అందుకే వారితో కలిసి పని చేస్తున్నాం. అయితే ఆయా రంగాల్లో మనం అందిపుచ్చుకున్న సాంకేతికతను ప్రజలకు.. మరీ ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి తేవాలి. టెక్నాలజీ ద్వారా ప్రజలు లాభం పొందాలి. అప్పుడే సాంకేతికతకు సార్థకత చేకూరుతుంది.” అని చంద్రబాబు చెప్పారు. వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించడానికి ప్రత్యేక కారణం ఉంది.
ఆరోగ్యరంగంలో టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
ఈ రంగాలు ప్రజలు, పేదలకు అత్యంత అవసరమైనవి అన్నారు. రాన్రాను వైద్యమనేది సామాన్యునికి భారంగా మారుతోంది. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలి. కొన్ని కొన్ని రోగాలకు కోట్లాది రూపాయల మేర డబ్బులు అవసరమవుతున్నాయి. అందుకే ఆరోగ్య రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించే అంశంపై దృష్టి పెట్టాం. ప్రతిఆరు నెలలకోసారి ప్రజలకు రక్త పరీక్షలు చేపట్టాలి. రోగాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది ముందుగానే గుర్తించాలన్నారు. ఆ డేటా ఆధారంగా ప్రజలకు ముందుగానే ఆరోగ్య సలహాలు.. సూచనలు అందించేలా చూడాలి. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా వారికి కావాల్సిన వైద్య సేవలు, సూచనలు అందించాలి. ప్రతి రోజూ వ్యాయామం, యోగా వంటివి చేస్తే.. సగం రోగాలు తగ్గిపోతాయి. అలాగే మన ఆరోగ్య పద్దతులు మార్చుకుంటే చాలా రోగాలు దరిచేరవు. ఇక పుట్టిన పిల్లల్లో వైకల్యం మొదలుకుని.. పోషకాహార లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించగలగాలి. దీని కోసం కేర్ అండ్ గ్రో విధానాన్ని అనుసరిస్తున్నాం. ఎవరెవరికి ఏయే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని.. వారిని నిరంతరం మానిటర్ చేసేలా ఉండాలి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ మెడికల్ కన్సల్టేషన్ ఉండాలని చంద్రబాబు అన్నారు.
చరిత్రలో చంద్ర బాబు ఎవరు?
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు. అభివృద్ధి, టెక్నాలజీ వినియోగంలో ముందుండిన రాజనీతి శిల్పిగా పేరొందారు.
చంద్రబాబు ఎన్ని సార్లు సీఎం అయ్యారు?
2024 ఎన్నికలలో భారీ విజయం సాధించిన తర్వాత, 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాయుడు నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని మినహాయించి 24 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గంతో ప్రభుత్వం స్థాపించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Indrakeeladri: అంబరాన్నంటిన శాకంబరి ఉత్సవ సంబరాలు