ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఏపీ అభివృద్ధి, భూ సమస్యలు, మాదకద్రవ్యాల నివారణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు ఆయన మీడియాతో వెల్లడించారు. మున్ముందు ఎన్డీయే కూటమి వ్యూహాన్ని ఎలా అమలు చేయాలన్న విషయంపై అమిత్ షాతో సమాలోచనలు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగేందుకు కేంద్ర సహాయ సహకారాలపై చర్చలు జరిగాయని చెప్పారు.
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు పై చర్చ
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చంద్రబాబు ముఖ్యంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలు విపరీతంగా జరిగాయని, ప్రైవేట్ భూములను బలవంతంగా 22ఈ కింద చేర్చి, వాటిని అధికార దుర్వినియోగం ద్వారా ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో విజయవంతంగా అమలు చేసిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని, ఏపీలో కూడా ఈ బిల్లును త్వరగా ఆమోదింపజేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. భవిష్యత్తులో భూసంబంధిత అక్రమాలను అరికట్టేందుకు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో భూ రికార్డుల కంప్యూటరైజేషన్కు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు.
గంజాయి కట్టడి కోసం ప్రత్యేక వ్యవస్థలు
ఏపీలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. మాదకద్రవ్యాల వ్యాపారాన్ని సమూలంగా అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. గంజాయి కట్టడి కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ రవాణా విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంజాయి తోగలిసినవారికి ఉపాధి కల్పనతో పాటు ప్రత్యామ్నాయ జీవనాధార మార్గాలను అందించేందుకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ
రాష్ట్ర అభివృద్ధి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో పాటు, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై చర్చలు జరిగాయి. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ వంటి కరవు ప్రాంతాలకు మేలు జరుగుతుందని, సముద్రంలో వృథాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకోవడానికి పోలవరం ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. భవిష్యత్తులో 15% వృద్ధిరేటును సాధించడం లక్ష్యమని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.