
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలిసారి విమానం ల్యాండ్ అయింది. (AP) ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఏ320 కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా భోగాపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఇందులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), ఇతర అధికారులు ప్రయాణించారు.
Read also: Funds: తెలంగాణలో రైతు భరోసా కట్.. రైతులకు షాక్.

వచ్చే 4-5 నెలల్లో సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు
విమానాశ్రయ (AP) ప్రారంభానికి ముందు రన్వే, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేపై విమానం సురక్షితంగా దిగడంతో, ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు 97 శాతం పూర్తయి తుది దశకు చేరుకున్నట్లు స్పష్టమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇక్కడ ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలనేది నారా లోకేశ్ ఆలోచన అని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘట్టంపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, ప్రధాని మోదీ దార్శనికతతో 2014-19 ఎన్డీఏ హయాంలో ప్రారంభించిన ఈ విమానాశ్రయం, 2026 జూన్ నాటికి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతుందని తెలిపారు. ఇది ఉత్తరాంధ్రను కొత్త శిఖరాలకు చేర్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. సుమారు రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ సంస్థ పీపీపీ పద్ధతిలో ఈ ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తోంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీనిని తీర్చిదిద్దారు. రానున్న 4-5 నెలల్లోనే వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: