రాష్ట్రంలో విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6వేల కోట్లతో పనులు చేపట్టినట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అదితి విజయలక్ష్మీ గజపతిరాజు, కోళ్ళ లలిత కుమారి, ముత్తుముల అశోత్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లా విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 200కు పైగా 33/11 కేవీ సబ్ స్టేషన్లు అవసరం ఉందని గుర్తించి, వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు.
Read also: Nakkapalli Steel Plant : నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

New substations across the state at a cost of Rs. 6,000 crore
విజయనగరం ప్రాజెక్టులు మరియు అండర్ గ్రౌండ్ కేబులింగ్
విజయనగరం వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రస్తుతం రీటెండరింగ్ దశలో ఉన్నాయని, 2027 మార్చినాటికి పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో రూ.46కోట్ల వ్యయంతో 220కేవీ, 132కేవీ లైన్ల పనులు పూర్తి అయ్యాయని, వాటిని త్వరలో చార్జ్ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వేణుగోపాలపురంలో రూ.77కోట్లతో సబ్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని మంత్రి సభకు వివరించారు. విజయనగరంలో కూడా విశాఖపట్నం తరహాలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కోరగా, ఆ వ్యవస్థ ఖర్చుతో కూడుకుందని మంత్రి తెలిపారు. నిధుల లభ్యత, అవసరాన్ని బట్టి ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ – ప్రభుత్వ ప్రణాళికలు
గిద్దలూరు నియోజకవర్గంలో 220కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కోరగా, విద్యుత్ శాఖ ఫిజిబిలిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరిగిందని, దీంతో రోజువారీ విద్యుత్ వినియోగం 263 మిలియన్ యూనిట్ల నుండి 280 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి పెంపుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 400కేవీ, 220కేవీ, 132కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
నిరంతర విద్యుత్ సరఫరానే లక్ష్యం
రైతులకు పెద్దఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, వ్యాపార, పారిశ్రామిక, గృహ అవసరాల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత లేకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 33/11కేవీ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: