విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విశాలమైన సాగరతీరాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవనశైలి సముద్రానికి ముడిపడి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ప్రతి రోజూ సముద్రంలో పడవలపై వెళ్లి చేపలు పట్టి తమ కుటుంబాలను పోషిస్తున్నారు. సముద్రమే వీరి ఆశ్రయంగా, ఆదారంగా, జీవనాధారంగా మారింది. అయితే ఇదంతా మామూలే, కానీ అప్పుడప్పుడు ప్రకృతి స్వరూపం మారి మృత్యుదేవతగా మారిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తుఫానులు, అల్పపీడనాలు, ఈదురు గాలులు సముద్రాన్ని రాక్షసంగా మలచేస్తాయి. అలాంటి సందర్భాల్లో చాలామంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు తమ ప్రాణాలను కోల్పోయిన ఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే ఓ మత్స్యకారుడ్ని (Fisherman) చేప లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది.వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లి పెద్ద చేప వలకు చిక్కిందిలే అనుకుని సంబరపడగా ఆ చేపను చేజిక్కించుకునే ప్రయత్నంలో యువకుడు సముద్రంలో మునిగి గల్లంతయ్యారు.
పూర్తి వివరాలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి యర్రయ్య అనే యువకుడు తన తమ్ముడు కొర్లయ్య, గనగళ్ల అప్పలరాజు, వాసుపల్లి యల్లాజి అనే మరో ముగ్గురితో కలిసి బుధవారం తెల్లవారుజామున చేపల వేట (fishing) కు వెళ్లారు. సముద్ర తీరం నుంచి 30 కిలో మీటర్ల దూరం వెళ్లాక చేపల వేట మొదలు పెట్టారు. వీరు చేపల కోసం గాలం వేయగా కొమ్ముకోనాం చేప చిక్కింది. దీని బరువు 100 కిలోల వరకు ఉంటుంది. పెద్ద చేప చిక్కిందిలే అని సంతోపడ్డారు. యర్రయ్య తాడుతో ఆ చేపను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు యర్రయ్య తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో యర్రయ్యను చేప బలంగా సముద్రంలోకి లాగేసింది. పడవలో నుంచి యర్రయ్య నీళ్లలోకి పడిపోయాడు.

పడవల సాయంతో
యర్రయ్య, తమ్ముడు, తోటి మత్స్యకారుల కళ్లముందే సముద్రంలో గల్లంతయ్యాడు. వెంటనే యర్రయ్య తమ్ముడు కొర్లయ్య ఈ సమాచారాన్ని స్థానికులకు చేరవేశాడు. వెంటనే స్థానిక మత్స్యకారులు కొందరు పడవల సాయంతో యర్రయ్య (Yarrayya) గల్లంతైన చోట సముద్రంలో వెతికినా లాభం లేకుండా పోయింది.అతడి ఆచూకీ దొరకలేదు. యర్రయ్య గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.పూడిమడకలో విషాద చాయలు అలముకున్నాయి. తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే మత్స్యకారుడ్ని చేప లాక్కెళ్లడం కలకలం రేపింది.
Read Also: MP Laxman: టీటీడీ అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తానన్న ఎంపీ లక్ష్మణ్