సినీ నటుడు చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూనీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ, సెటైర్లు వేశారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనలో కాదు, కాంగ్రెస్లో విలీనం అయిందని గుర్తుచేశారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో బీజేపీలో కలుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

చిరంజీవి ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారు? అనే ప్రశ్నను లేవనెత్తిన అంబటి రాంబాబు, “తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యిందన్నట్లు ఉంది. చిరంజీవి ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదో తెలియదు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయింది, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అదే విధంగా జనసేన బీజేపీలో కలిసిపోతుందా? పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కేంద్ర మంత్రి అవుతారా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.