తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లతో రూపొందించబడింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు కేటాయించబడింది. అభివృద్ధి ప్రాధాన్యతతో కూడిన ఈ బడ్జెట్, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజలకు జవాబుదారీతనం తో పాలన
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పగించారని పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీతనం తో పాలన అందిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధి కోసం తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా వ్యవసాయం, విద్య, వైద్యం, పథకాల అమలు వంటి ముఖ్య రంగాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పారు.

రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు
రైతుల సంక్షేమం, విద్యా అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి యువత కోసం కొత్త విధానాలను అమలు చేయబోతున్నామని వెల్లడించారు. కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నా, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
శాఖల వారిగా కేటాయింపులు చూస్తే
వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
విద్యా రంగం – రూ.23,108 కోట్లు
కార్మికశాఖ – రూ.900 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
చేనేత రంగం – రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
ఐటీ రంగం – రూ.774 కోట్లు
విద్యుత్ రంగం – రూ.21,221 కోట్లు
వైద్య రంగం – రూ.12,393 కోట్లు
పురపాలక రంగం – రూ.17,677 కోట్లు
నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
క్రీడలు – రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం – రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
హోంశాఖ – రూ.10,188 కోట్లు